30-01-2025 12:00:00 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, జనవరి 29 (విజయక్రాంతి) : వైద్య సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైరాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అనుముల మండలంలోని హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రికార్డులు పరిశీలించారు.
సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ దవాఖానాలపై మరింత నమ్మకం పెంచాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని చెప్పారు. పీహెసీకి పల్స్ ఆక్సీమీటర్లు, సెల్ కౌంటర్ పరికరాలు అందిస్తామన్నారు.
అనంతరం స్థానిక కేజీబీవీలో సౌకర్యాలు, వంట సామగ్రి పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో వారంరోజుల్లో ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, వైద్యుడు రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.