19-02-2025 12:00:00 AM
మద్దులపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం, ఫిబ్రవరి 18 : ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. కాటారం మండలం మద్దులపల్లి చెక్ పోస్ట్ ను ఎస్పి కిరణ్ ఖరే ఆకస్మికంగా తనిఖి చేసారు. ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీశారు.
క్వారీలో ఎటువంటి అక్రమాలకు పాల్పడిన, జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోందని, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పి తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (పీ డి పీ పీ) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతంలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు.