calender_icon.png 6 October, 2024 | 10:01 AM

అవినీతి ఆరోపణలపై విద్యుత్ సంస్థ చర్యలు

11-09-2024 01:11:28 AM

లంచం అడిగిన శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో అవి నీతి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయగా, అందిన ఫిర్యాదులపై సంస్థ చర్యలు మొదలు పెట్టింది. నాలుగు రోజులుగా వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తూ.. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తప్పుచేసిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మెదక్ సర్కిల్ శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి. దుర్గప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ పి.భిక్షపతి మం గళవారం ఆదేశాలు జారీ చేశారు.

ఓ పనికి సంబంధించి ఎస్టిమేట్ తయా రు చేసి, వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయడానికి దుర్గప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్నారని ప్రత్యేక కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందింది. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు. సంస్థలో అవినీతిని సహించేదిలేదని, ఎవరైనా లంచమడిగితే 040 768 090 1912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చైర్మన్, ఎండీ ముషారప్ ఫరూఖీ తెలిపారు.