04-04-2025 09:11:11 PM
వాహనదారులకు ధ్రువ పత్రాలు తప్పనిసరి
హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్
హుజురాబాద్,(విజయక్రాంతి): వాహనాలు నడిపే వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సబ్ డివిజన్లో శుక్రవారం కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హుజురాబాద్ సబ్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో జరిపిన వాహన తనిఖీల్లో 16 మైనర్ డ్రైవింగ్ తో పాటు నెంబర్ ప్లేట్ లేని సుమారు 67 వాహనాలను వరకు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జి మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా వారి వెంట వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలు ఉండాలని అన్నారు.
వాహనానికి నెంబర్ ప్లేట్ సరిగా లేకున్నా నెంబర్ ప్లేట్ల పై పిచ్చి రాతలు రాసిన వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నెంబర్ ప్లేట్ ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వలన ఎన్నో ప్రమాదాల భారి నుంచి కాపాడుకోవచ్చు అని తెలిపారు. మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే వాహన యజమాని పై సెక్షన్ 181, 199(A)కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, జమ్మికుంట రూరల్ సిఐ కిషోర్, హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట టౌన్ సిఐ వరగంటి రవి, ఎస్సైల తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.