30-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29(విజయక్రాంతి) : సమయం పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. సోమవారం సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఆ సమయంలో ఆఫీసులో ఎమ్మార్వో, పలువురు కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించి సమయానికి రాని వారికి ఆబ్సెంట్ వేశారు. విధుల పట్ల నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సికింద్రాబాద్ తహసీల్ధార్ ఈ.పాండునాయక్, సర్వేయర్ కె.కిరణ్కుమార్, ఏఆర్ఐ పి.ప్రసన్నలక్ష్మి స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి.జే పాల్, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ మోయినుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ జి.అనూష, రికార్డ్ అసిస్టెంట్ ఎం.మినేష్, రికార్డ్ అసిస్టెంట్ ఎం.ప్రమోద్, రికార్డ్ అసిస్టెంట్ బి.రాజశేఖర్, ఆఫీస్ సబార్డినేట్ బి.మాలతి, చైన్మెన్ పి.సతీష్ తదితరులకు షోకాజ్ నోటీసులిచ్చారు.
రాజీవ్ యువవికాసం వెరిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలి
అనంతరం సికింద్రాబాద్ మండలంలో రాజీవ్ యువవికాసం దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని దరఖాస్తులను ఫిజికల్ వెరిఫికేషన్, స్క్రూట్నీ చేసి పంపారు. అని ఎమ్మార్వోను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్లో 7327మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 2572మంది దరఖాస్తులు తమ కార్యాలయానికి వచ్చినట్లు ఎమ్మార్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో పి.సాయిరాం, ఎమ్మార్వో పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29(విజయక్రాంతి) : నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ పరీక్ష నిర్వహణపై సెంటర్ సూపరిండెంట్లు, కోఆర్డినేటర్లు, వివిధ బ్యాంకులు అనుబంద శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మే 4న జరుగబోయే నీట్ పరీక్షకు జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 26,609మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వెంక టాచారి, అడిషనల్ డీసీపీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.