30-04-2025 12:59:31 AM
పెద్దపల్లి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, పెద్దపల్లి విధులకు ఆటంకము కలిగించి భయభ్రాంతులకు గురిచేసి, వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే కేసు నమోదు చేయించిన శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖని యజమాన్యం మరియు సిబ్బంది తదితరులపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా టిఎన్ జిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మరియు వైద్య ఉద్యోగులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 తేదిన శనివారం డా. జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి గారు విధి నిర్వహాణలో బాగంగా శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖనిని తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించడం జరిగినది.
చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేరము కావున తన విధి ప్రకారం చర్యలు తీసుకొనుచుండగా దానికి అడ్డుపడి, నానా విధాలుగా బెదిరించి మరియు ఐఎంఏ డాక్టర్లు మరియు ఇతర వ్యక్తులను పిలిపించి విధులకు ఆటంకము కలిగించి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి పై దౌర్జన్యము చేసి, భయభ్రాంతులకు గురి చేయడమైనది మరియు చంపి వేస్తామని బెదిరించారు. కావున వారి పైన చట్ట రీత్యా తగు చర్యలు తీసుకొనగరని మా యొక్క మనవి మరియు ఆసుపత్రి యాజమాన్యమైన ప్రభుత్వ డాక్టర్ నాగిరెడ్డి మరియు అందులో భాగసౌమ్యులైయుండి కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు ప్రభుత్వ డాక్టర్ ఆర్.జె. స్వాతి గార్లను వెంటనే సస్పెండ్ చేయాలని అని కోరారు.
ఈ దౌర్జన్యములో పాల్గొన్న డా. బి. అనిల్ కుమార్ గారి పైన తగు చర్యలు తీసుకుంటూ మెడికల్ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ ను రద్దు చేయుటకు మెడికల్ కౌన్సిల్ బోర్డు కు సిఫారసు చేయవలసినదిగా కోరారు. ఈ దౌర్జన్యములో పాల్గొన్న మహాంకాళి స్వామి, అతని అనుచరులు మరియు హాస్పిటల్ యజమాన్యం, రిసెప్షనిస్ట్ ఆనంద్ పైన చర్యలు తీసుకోవాలని మరియు ఆక్రమ కేసు బనాయించిన ఆనంద్ కేసు ఉపసంహరించుకోవలసినదిగా డిమాండ్ చేశారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మహిళ అయిన డా. జి. అన్నా ప్రసన్నకుమారి గారికి తగు రక్షణ కల్పించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ బి .శ్రీరాములు, డాక్టర్ బి.కిరణ్ కుమార్, వీరగోని శ్రీనివాస్ టి ఎన్ జి ఓ హెల్త్ ఫోరం అధ్యక్షులు, శ్రీ ఉమమహేశ్వర్, టి. జి. ఓ. హెల్త్ ఫోరం అధ్యక్షులు, దేవీ సింగ్, రాష్ర్ట పారా మెడికల్ ఆఫీసర్ ల ఫోరం అధ్యక్షులు, ఆర్ బి ఎస్ కె డాక్టర్లు, శ్రీ కె రమేష్, టి రాజేష్, సాలమ్మ, దాయా మని, ఎన్ హె ఎమ్ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.