17-04-2025 03:18:59 PM
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారాపు వెంకటేష్.
హుజురాబాద్ (విజయక్రాంతి): ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న శ్రీ కాకతీయ (శ్రీ చైతన్య) పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారాపు వెంకటేష్ కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... హుజరాబాద్ పట్టణంలోని ఉన్న కార్పొరేట్ పాఠశాలలు న్యూ కాకతీయ కురికులం పేరుతో నడుపుతూ (శ్రీ చైతన్య) కు సంబంధించిన డ్రెస్సులు బుక్స్ ఇస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన మామూలుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. 2023 -2024 విద్యా సంవత్సరం ముగియకముందే 2024-2025 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్ఓ లతో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఎలాంటి రసీదు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరికొన్ని పాఠశాలలు పెద్దపెద్ద హోల్డింగ్స్ ఫ్లెక్సీలు ప్రచార అర్బాటాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులపై రుద్దుతున్నారన్నారు.
పట్టణంలో నిర్వహిస్తున్న ఏ కార్పొరేట్ పాఠశాలలకు సరైన గ్రౌండ్ లేదని అన్నారు. అనుమతులు ఇచ్చేముందు విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుని పర్మిషన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల మండల విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాము యాదవ్, ఉపాధ్యక్షులు కనకం సాగర్, కోశాధికారి విష్ణు, నాయకులు సందీప్, రాహుల్, మనీతో పాటు తదితరులు పాల్గొన్నారు.