calender_icon.png 21 October, 2024 | 3:34 AM

హైదరాబాద్‌లోనే యాక్షన్

21-10-2024 12:42:26 AM

బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణె, అలియా భట్, శార్వరి బాటలో మరో నటి బాలీవుడ్ క్వీన్ కాజోల్ కూడా పయనిస్తోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్’. టాలీవుడ్ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్- ఇండియా చిత్రమిది. ఇందులో నసీరుద్దీన్ షా, ప్రభుదేవా, సంయుక్త మీనన్, జిషు సేన్‌గుప్తా కూడా నటిస్తున్నారు. కాజోల్ ఇందులో మాయ అనే పాత్రను పోషిస్తోంది.

‘మాయ’.. ధారావిలోని మురికివాడల నుంచి మహారాష్ట్రలో ఓ శక్తిగా ఎదిగిన ఒక భయంకరమైన, దృఢమైన మహిళ. ప్రతీకారం తీర్చుకునే కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజోల్ పూర్తి యాక్షన్ అవతార్‌లో కనిపించనుంది. తన పాత్ర కోసం ఆయుధాల వాడకం, ఫైట్స్‌లో కఠినమైన శిక్షణ పొందినట్టు తెలియవస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరులోగా పూర్తి కానుంది. సింహభాగం షూటింగ్ హైదరాబాద్‌లోనే నిర్వహించిన చిత్రబృందం చివరి దశ షూటింగ్‌ను ముంబయిలో నిర్వహించాలకుంది. అయితే, ప్రణాళికలో మార్పు కారణంగా ఆఖరి షెడ్యూల్ సైతం ఇక్కడే నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రస్తుతం ప్రధాన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజీ, ‘దేవర’కు పనిచేసిన పీటర్ హెయిన్ ఈ చిత్రానికి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘జాన్ విక్: చాప్టర్ 4’ వంటి హాలీవుడ్ చిత్రానికి పనిచేసిన జర్మన్ స్టంట్ కోఆర్డినేటర్ ఫ్లోరియన్ హాట్జ్, టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నాగ వెంకట్ నాగతో కలిసి యాక్షన్ సన్నివేశాలకు పనిచేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.