- ఐవోసీకి సతీశ్ కుమార్
- హెచ్పీసీఎల్కు రాజేశ్ నారంగ్
న్యూఢిల్లీ, ఆగస్టు 28: పెట్రో కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)కు బుధవారం కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక చైర్మన్లను నియమించింది. వీటికి పూర్తికాలపు చైర్మన్ల నియామక ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి ఐవోసీకి సతీశ్ కుమార్ వడుగూరిని తాత్కాలిక చైర్మన్గా నియమిస్తున్నట్టు చమురు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఐవోసీ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నారు.
సెప్టెంబర్ 1న కొత్త పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం చైర్మన్ బాధ్యతల్లో ఉన్న శ్రీకాంత్ మాధవ్ వైద్య పొడిగింపు పదవీకాలం ఈ నెలాకరుతో ముగుస్తుంది. హెచ్పీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) రాజేశ్ నారంగ్ను సెప్టెంబర్ 1 నుంచి మూడు నెలల కాలానికి కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ మంత్రిత్వ శాఖ మరో ఉత్తర్వును జారీచేసింది. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న పుష్కకుమార్ జోషి స్థానంలో నారంగ్ను నియమించారు.