08-04-2025 01:13:05 AM
సెక్రటేరియేట్ మీడియా పాయింట్ వద్ద ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోగొట్టుకోకుండా 400 ఎకరాల భూములను హెచ్సీయూకు అప్పగించాలని బీజేపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. సోమవారం ఆయన సెక్రటేరియేట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
హెచ్సీయూలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్బంధకాండను ఆపివేయాలని, విద్యార్థుల పట్ల గౌరవంతో మెలగాలని కోరారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రజలు కూడా గ్ర హించారని సహకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రభుత్వమే ప్రతి సమస్యనూ రాజకీయ కోణంతో చూస్తోందన్నారు.
50 ఏళ్ల హెచ్సీయూ అకడమిక్ వారసత్వం, పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యా నికి బలికాకుండా చూడాలన్నారు. హెచ్సీయూ విద్యార్థులపై తక్షణమే దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో పాటు కోర్టులు కూడా ఈ వ్యవహారంలో స్పం దించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ముగుస్తున్నందున గత మూడేళ్ల ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.