calender_icon.png 25 September, 2024 | 8:09 AM

పోక్సో కేసులో నిందితుడికి జైలు

25-09-2024 02:39:40 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 24: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. వివరాలు.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన రాజు(23) జీవనోపాధి కోసంఅబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

2018లో రాజు.. స్థానికంగా ఉన్న ఓ మైనర్‌ను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేయగా ఎల్బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు కేసును విచారించింది.

పూర్తి విచారణ అనంతరం రాజును దోషిగా నిర్ధారిస్తూ మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి ఐదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.2లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.