26-03-2025 01:40:59 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్(56) హత్య కేసులో నిందితుడు దస్తగిరిని ఐఎస్ సదన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడనే కక్షతో నిందితుడు హత్య చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుమ్మలూరుకు చెందిన ఇజ్రాయెల్ తన భార్య పిల్లలతో కలిసి చంపాపేట మారుతీ నగర్లో నివాసముండేవారు.
సమీపంలోని సంతోష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆయన కార్యాలయం ఉంది. అదే అపార్ట్మెంట్లో దస్తగిరి కూడా ఉండేవాడు. ఆ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ భార్యతో దస్తగిరికి వివాహేదర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన ఆ వాచ్మెన్ తన కుటుంబాన్ని మరో ప్రాంతానికి తరలించాడు.
దీనికి ఇజ్రాయెల్ కారణమనే అనుమానంతో ఆయనతో దస్తగిరి పలు మార్లు గొడవపెట్టుకున్నాడు. దీంతో ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కక్ష పెంచుకున్న దస్తగిరి 10 రోజులుగా రెక్కీ నిర్వహించి సోమవారం ఇజ్రాయెల్పై కత్తితో దాడి చేసి గొంతు కోసి, ఛాతిలో పొడిచి పారిపోయాడు.