20-03-2025 01:29:27 AM
ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన
కొత్తగూడెం, మార్చి 19 (విజయ క్రాంతి ) కోయగూడెం ఓసీ 2,ఫిట్ -2,3లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు, హైకోర్టు తీర్పు ప్రకారం భూమి, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ, ఆర్డీఓ కార్యాలయం ముందు భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన, ధర్నా నిర్వహించారు.
భూ నిర్వాసితుల సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు,రేపాకుల శ్రీనివాస్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించటం తో నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. 2008 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టాన్ని, ప్రభుత్వం, పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించి,జిల్లా రెవెన్యూ, సింగరేణి అధికారులు పునరావాస ప్యాకేజీ నామమాత్రంగా చెల్లించినారని వారు ఆరోపించారు. భూమి నష్టపరిహారం అసలు ఇవ్వలేదని అన్నారు.
భూమి నష్టపరిహారం కోసం మళ్ళీ నిర్వాసితులు wp no 12169/2016, 12214/2016 కోర్టు నాశ్రయిస్తే . గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు నిర్వాసితులకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని ఆదేశించిందని, నేటికీ కోర్టు ఆదేశాల ప్రకారం నష్టపరిహారం అందలేదన్నారు. వెంటనే హైకోర్టు తీర్పు అమలు చేసి భూమి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, పూనెం స్వామి,పూనెం చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, దొడ్డ కోటేశ్వరరావు,చీమల క్రిష్ణ,బానోత్ వస్రాం, నరేష్, లక్ష్మి,ఈసం చుక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు