కూకట్పల్లి, సెప్టెంబర్ 29: భవన నిర్మాణంలో భూగర్భ కేబుల్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి పెల్లలు పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బీహార్ రాష్ట్రానికి చెందిన రవి కుమార్ (21) కూకట్పల్లి రంగనాయక స్వామి ఆలయం సమీపంలోని హానర్స్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఆదివారం నిర్మాణంలో ఉన్న భవనంలో భూగర్భ కేబుల్ లైన్ కోసం తవ్వుతుండగా పై నుంచి మట్టి దిమ్మెలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.