calender_icon.png 23 October, 2024 | 4:54 AM

మద్యం మత్తులో భక్తులతో దుర్భాషలు

03-08-2024 12:52:50 PM

శ్రీశైల దేవస్థానం అధికారులకు ఫిర్యాదు 

ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): శ్రీశైల మల్లికార్జున బ్రమరాంబిక ఆలయ క్యూలైన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులు తప్పతాగి భక్తులపై దుర్భాషలాడుతూ హంగామా చేశారు. దీంతో శుక్రవారం యాదాద్రి- భువనగిరి ప్రాంతానికి చెందిన బింగి భరత్ కుమార్ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన అధికారులు ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయడంతో పాటు క్యూ కాంప్లెక్స్ విభాగం సహాయ కార్య నిర్వహణ అధికారిని సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఈఓడీ పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తొలగించారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ చేశారు. 

శ్రీశైల మహాక్షేత్రం క్యూ కాంప్లెక్సులో పొరుగు సేవల సిబ్బందిగా పని చేస్తున్న పీ నాగేంద్రం మద్యం మత్తులో భక్తులను దుర్భాషలాడి, వారికి ఇబ్బంది కలిగించారని దేవస్థానం అధికారులకు యాదాద్రి- భువనగిరి వీహెచ్పీ నాయకులు బింగి భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన దేవస్థానం అధికారులు విచారణలో సంబంధిత ఫిర్యాదు దారు చేసిన ఆరోపణ వాస్తవం అని నిర్ధారించారు. సంఘటనకు కారకుడైన పీ నాగేంద్రం విధులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకే ముగిసినా డ్యూటీలో లేకున్నా దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/ 1987 ప్రకారం క్షేత్ర పరిధిలో మద్యం సేవించి ఉండటం చట్ట విరుద్ధం. భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించడంతోపాటు దేవస్థానం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన పీ నాగేంద్రంను పొరుగు సేవల సర్వీసు నుంచి తక్షణం తొలిగించారు. అలాగే దేవస్థానానికి పొరుగు సేవల సిబ్బందిని సమకూర్చిన విజయవాడ- కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ వారిని సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు.

ఈ సంఘటన తీవ్రతరం కావడానికి కారకులైన క్యూ కాంప్లెక్స్ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి, క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆలయ విభాగం సహాయ కార్య నిర్వహణాధికారి, ముఖ్య భద్రతా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పర్యవేక్షకులకు మెమో జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవస్థానం అన్ని విధాల తగు చర్యలు తీసుకుంటుందని శ్రీశైలం ఈఓ డీ.పెద్దిరాజు తెలిపారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు, క్షేత్ర పవిత్రత కాపాడటానికి అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.