- అస్థవస్థంగా వనపర్తి ఎక్సైజ్ కార్యాలయం
- ఇంటినుంచి పనిచేసే జిల్లా అధికారికే వత్తాసు
- పట్టించుకోని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు
వనపర్తి, అక్టోబర్ ౨౧ (విజయక్రాంతి): వనపర్తి అబ్కారీ అధికారులు పొరుగు సేవలకే వత్తాసు పలుకుతున్నారు. సాక్షాత్తు జిల్లా అధికారే కార్యాలయానికి రాకుండా ఓ అవు ట్ సోర్సింగ్ సిబ్బంది చేత ఇంటి నుంచే కార్యకలాపాలు చక్కదిద్దుతున్నా ఉన్నతాధికారులు పట్టింపులేనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. కొన్ని విలువైన ఫైల్స్ పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది.
జిల్లా అధికారే ఆఫీసుకు రాకుండా పనులు చక్కబెడుతుండటంతో సిబ్బంది తీరు ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపణలొస్తున్నాయి. కల్తీ మద్యం, గుడుంబా నివారణ, గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నిలువరించడం కోసం చర్యలను తీసుకోవాల్సిన అధికారి.. అవేమీ పట్టించుకోకుండా కేవలం కల్లు దుకాణాల రెన్యూవల్, ఇతర వ్యవహారాలు మాత్రమే సంతకాలు చేస్తూ మమా అనిపిస్తున్నారు.
దీంతో గుడుంబా తయారీ వ్యవ హారం రోజురోజుకూ పెరుగుతోందని విమర్శలున్నాయి. దీంతోపాటు కర్ణాటక, గోవా ప్రాంతాలతోపాటు ఇతర ఆర్మీ లిక్కర్ పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్టు తరుచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇదే జిల్లాకు చెందినప్పటికీ సదరు అధికారి లెక్కే చేయకపోవడం గమనార్హం.
గత నెల ౨౭న ‘సార్ రారు.. ఇంటికే ఫైల్స్’ శీర్షికతో ‘విజయక్రాంతి’ కథనం ప్రచురించగా జిల్లామంత్రితో పాటు కలెక్టర్ ఆ శాఖ తీరు పట్ల బాహటంగా చర్చించడంతో సంబంధిత అధికారి ఇటీవ ల ఓ రోజు చుట్టపు చూపుగా కార్యాలయానికి ఇలా వచ్చి అలా వెళ్లినట్టు తెలిసింది.
అయినా సంబంధిత శాఖ అధికారి తీరు మార్చుకోకపోవడం పట్ల పలు అనుమానా లు తావు ఇస్తోంది. కాగా, ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించినట్టు వనపర్తి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేశ్ పేర్కొనడం గమనార్హం.