calender_icon.png 9 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితతో లిక్కర్ వ్యాపారంతోనే ఆప్ ఓటమి

09-02-2025 01:46:17 AM

  • కాంగ్రెస్‌తో కలిసుంటే పరిస్థితి వేరేలా ఉండేది 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌తో స్నేహమే కేజ్రీవాల్  కొంపముంచిందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆప్ పతనానికి పునాదులు పడ్డాయని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, లిక్కర్ వ్యాపారంతో ఇమేజ్‌కి తూట్లు పడ్డాయని, అవినీతికి కేజ్రీవాల్ కూడా అతీతుడు కాదన్న అభిప్రాయం ప్రజల్లో కలగడానికి కేసీఆర్ కుటుంబమే కారణమైందని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. రెండు దఫాలు ఢిల్లీని పాలించిన కేజ్రీవాల్‌పై లిక్కర్ స్కామ్ తప్ప మరే అవినీతి ఆరోపణలు లేవన్నారు.

కవిత లిక్కర్ వ్యాపార కాంక్ష కేజ్రీ సిద్ధాంతానికి తూట్లు పొడించిందని మహేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా పరిగణించడం కూడా కేజ్రీవాల్ పతనానికి కారణమని పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న నిర్ణయం బీజేపీకి మేలు చేసిందన్నారు.

కాంగ్రెస్‌తో కటీఫ్ నిర్ణయంలో హేతుబద్ధత లేదని, కాంగ్రెస్, ఆఫ్ విడివిడిగా పోటా చేయడం వల్ల బీజేపీకి లాభం చేకూరిందన్నారు. అన్నాహజారే చేపట్టిన అవినీతి రహిత భారతదేశ నినాదాన్నే తమ పార్టీ సిద్ధాంతంగా మార్చుకొని రాజకీయాల్లో వచ్చిన కేజ్రీవాల్ ఇంతింతై దేశరాజకీయాల్లో ముద్ర వేశారన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్‌ను కోలుకోలేని దెబ్బతీశాయన్నారు. ఈ పరిస్థితికి కేజ్రీవాల్ స్వయంకృతా పరాధమేనని పేర్కొన్నారు.