గూడ్స్ రైలును ఢీకొట్టిన భాగమతి ఎక్స్ప్రెస్
పట్టాలు తప్పిన 13 బోగీలు, 2 బోగీల్లో మంటలు
పలువురు ప్రయాణికులకు గాయాలు
చెన్నై, అక్టోబర్ 11: తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని కవరైపెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్ నుంచి దర్భంగా వెళుతున్న భాగమతి ఎక్స్ప్రెస్ (12578) ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వైద్యులు, ఆంబులెన్సులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపారు. ప్రయాణికులను తరలించేందుకు వీలుగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పా టు చేశారు.
పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి కవరైపెట్టు స్టేషన్ పరిధిలోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు వచ్చిందని, దీంతో గ్రీన్ సిగ్నల్ ప్రకారం మెయిన్లైన్లోకి వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి ప్రవేశించి గూడ్స్ రైలును ఢీకొట్టిందని దక్షిణ రైల్వే ప్రతినిధి తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలు 110 కి.మీ వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూ రు, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయా యి. పలు రైళ్లను ఇతర రూట్లకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.