calender_icon.png 21 September, 2024 | 5:26 PM

హాస్టల్‌లో విద్యార్థికి పాముకాటు

21-09-2024 12:32:53 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవలే సిరిసిల్ల జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురికావడం బాధాకరం. గాలిపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన ధరావత్ రోహిత్ (12) ఉంటున్నాడు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం పాఠశాలకు వెళ్లిన రోహిత్‌కు వాంతులు కావడంతో తిరిగి హాస్టల్‌కు చేరుకొని గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నాగుపాము చేతికి కాటు వేసింది. గమనించిన రోహిత్ వాచ్‌మెన్‌కు చెప్పడంతో చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత ఆసుపత్రి నుంచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా విషయం తెలుసుకున్న గ్రామస్థులు హాస్టల్‌కు వెళ్లి గదిలో ఉన్న నాగుపామును చంపేశారు.