calender_icon.png 23 October, 2024 | 3:55 PM

హాస్టల్ కిటికీలోంచి జారీ పడి విద్యార్థి మృతి..

23-10-2024 01:18:40 PM

మాదాపూర్ నారాయణ వర్మ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఘటన 

విద్యార్థి సంఘాలు ఆందోళన.. 

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): హాస్టల్ వార్డెన్ కళ్లు గప్పి స్నేహితులతో కలిసి బయటికెళ్లేందుకు ప్రయత్నించి కిటికీలో నుండి 5వ అంతస్తు నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మాటల్లో.. ఏపీ లోని కడప రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి (17) మాదాపూర్ లోని నారాయణ కాలేజీ వర్మ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉండడంతో కిటికీలో నుండి గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో  శివకుమార్ రెడ్డి ముందుగా కిందికి దిగేందుకు ప్రయత్నించి జారిపడిపోయాడు.

దీంతో ఇది గమనించిన తోటి స్నేహితులు భయపడి తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి వచ్చి విషయాన్ని హాస్టల్ వార్డెన్ కు చెప్పారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన హాస్టల్ వార్డెన్, విద్యార్థులు శివకుమార్ రెడ్డి వద్ద వెళ్లి చూడగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శివకుమార్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నారాయణ కాలేజీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగాయి. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్లే జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. భాదిత విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు.