ఆసుపత్రిలో చికిత్స
రాజేంద్రనగర్, ఆగస్టు 9: వీధి కుక్క దివ్యాంగ బాలుడిపై దాడి చేసి అతడి పురుషాంగాన్ని కొరికేసిన ఘటన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మపురం గ్రామానికి చెందిన మహేష్, అంజమ్మ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. కోకాపేట సబితానగర్లో ఓ గుడిసెలో ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
అతడు పుట్టుకతో మూగ.. అదేవిధంగా నడవలేడు. శుక్రవారం మధ్యాహ్నం బాలుడు నిద్రిస్తున్న గుడిసెలోకి చొరబడిన వీధి కుక్క అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ క్రమంలో బాలుడి పురుషాంగాన్ని సైతం కొరికేసింది. బాలుడి రోదనలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నార్సింగిలోని అరుణ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది.
మరో ఘటనలో..
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఎర్రబోడ ప్రాంతంలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన శ్యామ్ శుక్రవారం తన ఇంటి బయట నిలబడి ఉండగా అకస్మాత్తుగా వచ్చిన కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్సపొందుతూ బాలుడు మృతి..
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్కి చెందిన శివ, మాధవి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందు తూ మృతిచెందాడు. 20 రోజుల క్రితం కియాన్ష్ స్కూల్కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అతడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలవడంతో నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుఝామున కియాన్ష్ మృతిచెందాడు.