- ఎంపీ పదవికి టీఎంసీ నేత రాజీనామా
- అభయ ఘటనలో మమత తీరుపై అసహనం
- సీఎంకు లేఖలో ఎంపీ జవహార్ వెల్లడి
కోల్కతా, సెప్టెంబర్ 8: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలో దీదీ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ ఎంపీ జవహార్సర్కార్ మండిపడుతున్నారు. ఈ ఘటనపై మమతా బెనర్జీని వ్యతిరేకిస్తూ తన పదవికి ఆదివారం జవహార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పు కున్నట్లు ప్రకటిస్తూ మమతకు లేఖ రాశారు. ప్రభుత్వంపై అభిమానం చూపే కొంతమందిని, అవినీతిపరుల్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.
ఈ విషయం లో సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అవినీతికి పాల్పడ్డ అధికారులు, వైద్యులకు ప్రమోషన్లు కల్పించడం తాను అంగీకరించే ప్రసక్తి లేదని సర్కార్ తెలిపారు. వైద్య విద్యార్థిని విషయంలోనూ జవహార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఓపికతో ఎదురుచూశా. పైగా నిందితుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభు త్వం విఫలమైంది. రాజకీయం కోసం నిరసనలు చేయకుండా బాధితురాలికి న్యాయం చేకూరేలా, నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని దీదీ ప్రభుత్వానికి జవహార్ సూచించారు.