గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై గందరగోళం!
ప్రిలిమ్స్ కీ కి అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటున్న టీజీపీఎస్సీ
గతంలో వాటినే ప్రామాణికంగా తీసుకున్నారంటున్న అభ్యర్థులు
తెలుగు అకాడమీ పుస్తకాలపై ముదురుతున్న వివాదం
టీజీపీఎస్సీ, తెలుగు అకాడమీ కార్యాలయాల ముందు వెలసిన పోస్టర్లు
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలు పోటీపరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని హైకోర్టు ముందు ఇటీవల టీజీపీఎస్సీ వినిపించిన వాదనలు దుమారం రేపుతున్నాయి.
టీజీపీఎస్సీ వాదనను గ్రూప్-1 అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రు. గతంలో ఎన్నో పోటీ పరీక్షలకు ప్రామాణికంగా ఉన్న తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విషయంలో ఎం దుకు ప్రామాణికం కావంటూ ప్రశ్నిస్తున్నారు.
కేవలం అభ్యర్థులు వేసిన కేసులో పైచేయి సాధించేందుకు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఈ వాదనలను టీజీపీఎస్సీ విని పించడం సమంజసం కాదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జేఎల్ ని యామక ప్రక్రియకు సంబంధించిన ఓ కేసులో తెలుగు అకాడమీ పుస్తకాలను అధికారులు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు గ్రూప్-1 అంశంలో ఎందుకు తీసుకోరని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రామాణికంగా ప్రైవేట్ వ్యక్తుల పుస్తకాలెలా?
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ లోని నాలుగు ప్రశ్నల సమాధానాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, మరో రెండు ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన స మాధానాలను తెలుగు అకాడమీ ప్రచురించిన తెలంగాణ హిస్టరీ-కల్చర్-2016, తెలంగాణ రీజినల్ జాగ్రఫీ పుస్తకాలను రెఫరెన్స్గా తీసుకోవాలని అభ్యర్థుల వాదన.
ఈ పుస్తకాల ఆధారంగా ఫైనల్ కీ లో మార్పులు చేయాలంటున్నారు. కానీ టీజీపీఎస్సీ మాత్రం తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను ప్రామాణింకగా తీసుకోకుండా ప్రైవేట్ (ఆథర్) వ్య క్తులు రాసిన పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. హిస్టరీకు సంబంధించి అడప సత్యనారాయణ, జాగ్రఫీకు మాజిద్ హుస్సేన్ పుస్తకాన్ని ప్రామా ణికంగా తీసుకున్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా వికీపీడియాను ప్రామాణికంగా తీసు కున్నట్లు తెలిపారు.
ఏ పుస్తకాలు చదవాలో చెప్పండి?
ఉమ్మడి ఏపీలో నిర్వహించిన ఎన్నో పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రా మాణికంగా తీసుకున్న సందర్భాలున్నాయని అభ్యర్థులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ ఎంతో గుర్తింపు పొందిన సంస్థ అయినప్పుడు ఆ పుస్తకాలను ఎందుకు ప్రామాణికంగా తీసుకోరని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టీజీపీఎస్సీ వికీపిడియాను ప్రామాణికంగా తీసుకున్నప్పు డు..
తెలుగు అకాడమీ పుస్తకాలను ఎందుకు తీసుకొరో చెప్పాలంటున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారం భం కానున్నాయి. గ్రూప్-2 డిసెంబర్లో, గ్రూప్-3 నవంబర్లో నిర్వహించనున్నారు. ఈక్రమంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కావని సాక్షాత్తు టీజీపీఎస్సీ ప్రకటిస్తే గ్రూప్-2, 3కు ఏ పుస్తకాలు చదవాలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రివైజ్డ్ ఫైనల్ కీ ఇవ్వాలి..
ఆ ప్రశ్నలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని ఎక్స్పర్ట్ కమిటీకి అభ్యంతరాలను పంపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆ తర్వాత రివైజ్డ్ ఫైనల్ కీని విడుదల చేసి, మెయిన్స్కు తుది జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు ప్రశ్నలకు సమాధానాలు కలిసినా, తొలగించినా 3 వేల నుంచి 5 వేల మంది అభ్యర్థులు ఫలితాలు తారుమారయ్యే వీలుందని అంటున్నా రు.
ఇకమీదట నిర్వహించే పోటీ పరీక్షలకు ఏ పుస్తకాలు ప్రామాణికమో టీజీపీఎస్సీ స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఎలాంటి రెఫరెన్స్లు లేవని టీజీపీఎస్సీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
అభ్యర్థులు పెట్టిన సమాధానమే సరైనది అనుకోవద్దని టీజీపీఎస్సీ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. పోటీ పరీక్షలకు ఏ ఒక్క పుస్తకం ప్రామాణికంగా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అభ్యర్థులు అన్ని రకాల పుస్తకాలను సమగ్రంగా చదివి సిలబస్పై పట్టు సాధించాలని అభ్యర్థులతో అన్నట్లుగా తెలుస్తోంది.
కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం..
తెలుగు అకాడమీ పుస్తకాలపై టీజీపీఎస్సీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదర్గూడలోని తెలుగు అకాడమీ, నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాల యం ముందు పోస్టర్లు వెలిశాయి. గు ర్తు తెలియని వ్యక్తులు వాటిని అతికించినట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్లలో అధి కారులను ప్రశించారు.
టీజీపీఎస్సీకి గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహించడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. గ్రూప్ -1లోనే ఇన్ని తప్పులుంటే తర్వాత వచ్చే గ్రూప్ 2, 3లలో ఇంకెన్ని ఉంటాయనని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు కొనకండి.. చదవకండని పోస్టర్లలో పేర్కొన్నారు.
అభ్యంతరాల స్వీకరణ తర్వాతే ఫలితాలిచ్చాం: టీజీపీఎస్సీ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్ట్ల వారీగా నిపుణుల కమిటీకి పంపించామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. వచ్చిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు హైకోర్టుకు నివేదించింది. మెయిన్స్కు అర్హత సాధించిన వారికి త్వరలో పరీక్షలు జరగనున్నాయని టీజీపీఎస్సీ తెలిపింది.