calender_icon.png 23 September, 2024 | 4:56 PM

రొమాంటిక్ కామెడీ డ్రామాకు కొబ్బరికాయ కొట్టేశారు!

22-09-2024 12:00:00 AM

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈ సంస్థ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా తమ 27వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభించిందీ సంస్థ. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతు న్న ఈ చిత్రంలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీగౌరీప్రియ, ‘కోట బొమ్మాళి పీఎస్’ ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతోపాటు హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. భరద్వాజ్ ఆర్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.