calender_icon.png 24 October, 2024 | 9:55 AM

మహిళా విద్యకు మార్గదర్శకురాలు

05-09-2024 12:00:00 AM

టీచర్స్ డే అనగానే చాలామందికి గుర్తుకువచ్చే పేరు సావిత్రీబాయి ఫూలే. చదువుతోనే భవిష్యత్తు అనే లక్ష్యంతో బాలికల కోసం పాఠశాలలను స్థాపించి ఎంతోమంది విద్యావంతులను తయారుచేశారు. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్ గావ్ లో సావిత్రిబాయి జన్మించింది. 1847 నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం కొందరికి నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు.

బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. ఆమె విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం లభించాయి.

ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. 1851లో అనేక పాఠశాల ప్రారంభించారు. ఆతర్వాత  1852లోనే మహిళాసేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు, బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. ఇక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించి సమాజం కోసం ఎంతగానో పాటుపడ్డారు.