23-02-2025 12:00:00 AM
శ్రీలంక నావికాదళం ఇటీ వల భారత మత్స్యకార పడవపై జరిపిన కాల్పులు తమిళనాడులో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యకు తక్షణ శ్రద్ధ అవసరమని మరోసారి గుర్తు చేస్తున్నాయి. పాక్ జలసంధిలో శ్రీలంక పదే పదే భారత మత్స్యకారులను అరెస్టు చేయడం తమిళనాడులోని వేలాది మత్స్యకార కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తోంది.
ఇది భారత్, శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నిరంతర ఘర్షణ బిందువుగా మారింది. మత్స్యకారులను విడుదల చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భార త ప్రభుత్వం చెబుతుండ గా, దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం, అరెస్టులు, నిర్బంధాలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది.
తమిళనాడును ఉత్తర శ్రీలంక నుండి వేరుచేసే ఇరుకైన జలసంధి అయిన పాక్ జలసంధి శతాబ్దాలు గా ఉమ్మడి మత్స్యకార ప్రదేశంగా ఉంది. అయితే, 1974, 1976 నాటి ఇండో-శ్రీలంక సముద్ర సరిహద్దు రేఖ ఒప్పందాలు అధికారిక సరిహద్దులను గీశాయి. జనావాసాలు లేని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు బదిలీ చేశాయి.
భారత జలాల్లో అతిగా చేపలు పట్టడం, బాటమ్ ట్రాలింగ్ వంటి హానికరమైన పద్ధతులను అవలంబించడం వల్ల వనరుల క్షీణత ఏర్పడింది. జీవనోపాధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్నారు. తరచుగా అనుకోకుండా సముద్ర సరిహద్దులను దాటుతున్నారు. దీని ఫలితంగా శ్రీలంక నావికాద ళంతో తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి.
భారత యాంత్రిక ట్రాలర్లు సముద్ర జీవవైవిధ్యాన్ని నాశ నం చేస్తున్నాయని, ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులలోని మత్స్యకారు ల జీవనోపాధికి ముప్పు కలిగిస్తున్నాయని శ్రీలంక వాదిస్తోంది. శ్రీలంక అధికారులు అరెస్టు చేసి నిర్బంధించిన భారతీయ జాలర్లు, శ్రీలంక నేవీ అనేక సందర్భాల్లో తమపై కఠినంగా వ్యవహరించిందని, శారీరక హింసకు పాల్పడుతోందని, తమ పడవలు , ఫిషింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
శ్రీలంకలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఆ దేశంతో చర్చలు జరిపి ఈ సమస్యకు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని కనుగొనకపోతే ఇది రావణ కాష్టంగా రగులూనే ఉంటుంది. ని త్యం వేలాది ఫిషింగ్ బోట్లు తమిళనాడునుంచి చేపల వేట కు సముద్ర జలాల్లోకి వెళుతూ ఉంటాయి. అక్కడి తీరప్రాంత ప్రజలకు ఇదే ప్రధాన జీవనోపాధి. ఈ సమస్యపై తమిళనాడు ప్రభుత్వాలు గతంలోనే ఎన్నోసార్లు కేంద్రాని కి విజ్ఞప్తి చేశాయి కానీ పరిష్కారం కోసం ప్రయత్నించక పోవడం విషాదకరం.
ఆళవందార్ వేణుమాధవ్