కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలడమనేది కొందరు కథానాయకులకే సాధ్యం. కథానాయికలకు చాలా కష్టం. అలా దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలే కథానాయికలు ఇద్దరో, ముగ్గురో ఉంటారు. వారిలో కథానాయిక త్రిష ఒకరు. ఈ ముద్దుగమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలు చిన్న, పెద్ద హీరోలందరితోనూ నటించింది. అమ్మడి ఖాతాలో సూపర్ హిట్లు లెక్కలేనన్ని ఉన్నాయి.
అందం, అభినయంతో ఈ చెన్నై చందమామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగులోనే కాదు.. తమిళ్తో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అందుకే త్రిషను రికార్డుల మీద రికార్డులు వరిస్తున్నాయి. తాజాగా త్రిష ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. తమిళ్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన వాటిలో త్రిష చిత్రాలు ఉండటం విశేషం.
దీనిపై కోలీవుడ్లో త్రిష అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలోకి యంగ్, టాలెంటెడ్ హీరోయిన్లు చాలా మంది వస్తున్నారు. ఈ తరుణంలో నిలదొక్కుకోవాలంటే ఏ సినిమాలు పడితే అవి చేయకూడదని నిర్ణయించుకుందో ఏమో కానీ త్రిష చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తోంది.
కథకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో హిట్స్ అందుకున్న త్రిష ప్రస్తుతం అజిత్తో ఓ సినిమా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది.