21-04-2025 01:48:58 AM
యశోద హాస్పిటల్స్లో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారి ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): అవయవ మార్పిడి జీవితాలను ఎలా కాపాడుతుందో చూపించే అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్, కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్, కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ సహకారంతో సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ లైఫ్ విత్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ పేరిట ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు.
అవయవ మార్పిడి చేసుకున్న వారి జీవనశైలి, ముఖ్యంగా కిడ్నీ మార్పిడి చేసుకున్న తరువాత వారి జీవనశైలి ఎలా ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్కు ముందు వారు అనుభవించిన ఆనారోగ్య సమస్యలు, అవయవ మార్పిడి తరువాత వారు అనుభవిస్తున్న మెరుగైన జీవన విధానం ఎలా ఉందో తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ.. దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం పెరుగుతోందన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారని, వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అందించబడుతుందన్నారకు.
మిగిలిన వారు డయాలసిస్లో ఉండి, మార్పిడి కోసం వేచి ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20శాతం కంటే ఎక్కువ మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయన్నారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జి.యస్. రావు మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్లో అధునాతన సాంకేతికత, నిపుణులైన బహుళ వైద్య విభాగల ద్వారా ప్రపంచ స్థాయి మూత్రపిండాల సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
విజయవంతమైన మూత్రపిండాల మార్పిడి, రోగ నిర్ధారణ నుంచి పునరావాసం వరకు అంకితభావాన్ని తమ హాస్పిటల్ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 280 మంది కిడ్నీ మార్పిడి గ్రహీతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ దాతలు, డయాలసిస్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.