31-03-2025 12:04:14 AM
మీ సేవలో పనికో రేటు
పట్టించుకోని అధికారులు
లక్షెట్టిపేట, మార్చి 30 : పట్టణంలోని మీసేవ నిర్వాహకుల అక్రమ వసూళ్లు దందాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ మీసేవ కేంద్రాలు అవినీతి అక్రమాలకు వేదికగా మారాయి. ఈ కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో మీ సేవ నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ప్రభుత్వ పథకాలు వస్తే...
ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే మీసేవ నిర్వాహకులు ఇష్టా రాజ్యాంగ డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కేంద్రాలను కనీసం ఆకస్మిక తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీసేవ నిర్వాహకులు బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
మీసేవ సెంటర్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పట్టణ, మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఈ అక్రమ దందా బహిరంగంగా యదేచ్చగా కొనసాగుతుంది. అడ్డు అదుపు లేకుండా మీ సేవ కేంద్రం నిర్వాహకులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఈ అక్రమ వసూళ్లు జరుగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు. మీ సేవలో ఇతర సర్వీసులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు ధరను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగటం వలనే మీసేవ నిర్వాహకులు ఇంత బరితెగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు
ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే ప్రజలను నిలువు దోపిడీ చేసి డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా మీసేవ సెంటర్లు నడిపిస్తున్నారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వ నిర్దేశిత రుసుం కంటే అధికంగా చెల్లిస్తేనే ఇస్తున్నారు. అధికారులు వీటి పైన దృష్టి సారించాలి.
మెట్టుపల్లి శ్రీనివాస్
చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మీసేవ సెంటర్లు నిర్వహిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. ప్రభుత్వం సూచించిన విధంగా నడుచుకోవాలని, అధిక ధరలు తీసుకుంటే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
తహసిల్దార్ దిలీప్ కుమార్.