calender_icon.png 20 September, 2024 | 8:07 AM

తృటిలో తప్పిన రైలు ప్రమాదం

09-09-2024 12:00:00 AM

రెండుగా విడిపోయిన మగధ్ ఎక్ప్‌ప్రెస్

పాట్నా, సెప్టెంబర్ 8 ( విజయక్రాంతి): బీహార్‌లోని బక్సర్ జిల్లాలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు  వెళుతుండగా బక్సర్ జిల్లాలో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌ల మధ్య ఉన్న కప్లింగ్ తెగిపోయింది. దీంతో ట్వినిగంజ్, రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య మగధ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ వెనుక ఉన్న కోచ్‌లు మినహా మిగతావన్నీ ముందుకు వెళ్లాయి.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉదయం11.08 గంటలకు జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. రెస్క్యూ, టెక్నికల్ టీమ్స్ అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపు తున్నట్లు అధికారులు తెలిపారు.