జీవితఖైదు విధించిన న్యాయస్థానం
ఎల్బీనగర్, అక్టోబర్ 24: కూతురి(మైనర్)తో వ్యభిచారం చేయించడంతో పాటు చిత్రహింసలు పెట్టిన ఓ మహిళకు పొక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య భర్త మృతి చెందడంతో మైనర్ కూతురితో కలిసి జీవనోపాధి కోసం హయత్నగర్ వచ్చి నివాసం ఉంటోంది. సులభంగా డబ్బు సంపాదించాలని కూతురితో వ్యభిచారం చేయించడం ప్రారంభించింది.
ఈ క్రమంలో తల్లి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక బాధితురాలు 2023లో హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి ఎల్బీనగర్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు న్యాయమూర్తి హరీశ గురువారం తీర్పు వెలువరించారు. స ంధ్యకు జీవిత ఖైదుతో పాటు రూ. 2.96 లక్షల జరిమానా విధించారు.