- ఆస్తి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని మనస్థాపం
- కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఎంపీడీవో
ఇబ్రహీంపట్నం/యాచారం, అక్టోబర్ 25: పంచాయతీ కార్యదర్శి ఆస్తి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చౌదర్పల్లికి చెందిన ముక్క రి మధుసూదన్ తన ఇల్లుపై లోన్ తీసుకోవడానికి బ్యాంక్ అధికారులను కలిశాడు.
వారు ఆస్తి ధ్రువీకరణ పత్రం కావాలని అడగడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాడు. అయితే, కార్యదర్శి చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం చివరగా అడిగే ప్రయత్నం చేయగా ఆమె ఇవ్వనని తేల్చిచెప్పడంతో, మధుసూదన్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన గ్రామస్థులు యాచారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించ డంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మధుసూదన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎల్పీవో శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. కాగా, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎంపీడీవో ప్రకటించారు.