calender_icon.png 10 March, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

09-03-2025 04:58:28 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థినులు అందరూ ఒకచోట చేరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత బాల్య స్నేహితులందరూ విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకొని సందడి చేశారు. గత స్మృతులను, పాఠశాలలో చేసిన అల్లరి పనులను స్మరించుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం బాల్య మిత్రులు అందరూ ఒకచోట కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల ఆవరణలో కలియ తిరిగి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళనంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి తమ జీవితాలను మలుపు తిప్పిన గురువులను వేదికపైకి ఆహ్వానించిన విద్యార్థులు, పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువులకు పలువురు విద్యార్థినులు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఈ సందర్బంగా  నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థినులు  గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.  ఇలాంటి మహాసమ్మేళనాలు తరచూ జరుపుకోవాలని నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వర్ గౌడ్, ఎన్ స్వామి, జి గురు ప్రసాద్, ఫక్రుద్దీన్, రమా, జ్యోతి లతో పాటు పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు.