21-04-2025 12:21:48 AM
యాదాద్రి భువనగిరి; ఏప్రిల్ 20 ( విజయ క్రాంతి ): సమాజంలో నానాటికి పెరిగిపోతున్న కులాంతర వివాహితులకు రక్షణ కల్పించుటకై ప్రభుత్వాలు కులాంతర వివాహితుల రక్షణ చట్టాన్ని చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున సామాజిక ప్రజా సంఘాల నాయకులు మానుపాటి భిక్షమయ్య,పందుల సైదులు, వెంకట రమణారెడ్డి, షరీఫ్ లు డిమాండ్ చేశారు.
నల్లగొండలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యాలయంలో ప్రేమించి వివాహం చేసుకోవడానికి ఆటంకం సృష్టించడం వలన సంఘ కార్యాలయానికి వచ్చిన శాలిగౌరారం మండలం మాదారం గ్రామానికి చెందిన యాదవ కులానికి చెందిన శంకర్, బెస్త కులానికి చెందిన దీప్తిల కులాంతర ప్రేమికుల జంటకు ఆదర్శ వివాహం దండలు మార్చి వివాహం జరిపారు.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కులాంతర వివాహితులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ప్రణయ్, మాలబంటి,మల్లేశ్వరి, లాంటి వారిపై దాడులు జరిపి హత్యలు చేసిన సంఘటనలు చూస్తున్నామని వీరికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
హత్యగావించబడిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం కులాంతర వివాహితులకు రక్షణగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్, బొల్లు రవీందర్, షరీఫ్, శ్రీనయ్య, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.