calender_icon.png 10 October, 2024 | 7:02 PM

జీహెచ్ఎంసీ పథకాలను ప్రశంసించిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అధికారుల బృందం

10-10-2024 04:11:00 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ లో అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు గురువారం జీహెచ్ఎంసీ విధానాలు, అభివృద్ధి పథకాలను సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్సు, సిఆర్‌ఎంపి (కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్), సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కీలక విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు.

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్ (ట్యాక్స్), గీత రాధిక (ఫైనాన్సు), సిఆర్‌ఎంపి విభాగంలో సిఇ భాస్కర్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ చంద్ర, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో యస్‌ఈ కోటేశ్వర రావు, చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ మహేష్ కులకర్ణి, తదితరులు తమ విధానాలు, ప్రజల సమస్యలను పరిష్కరించే విధానాలను ఆంధ్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అధికారులు జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. ఈ యాత్రలో గుంటూరు, ఏలూరు, నెల్లూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వీరిలో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఈ ఈ సుందర రామి రెడ్డి, ఏలూరు కమిషనర్ ఏ. భాను ప్రతాప్, ఏ ఈ ఎలక్ట్రికల్  శేషగిరిరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నంబూరి రవి, నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎస్ ఈ గిరిధర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ కాలూరి వెంకట నాగ రవి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.