calender_icon.png 7 October, 2024 | 3:54 PM

చిన్న పరిశ్రమలకు చైనా దిగుమతుల పోటు

02-09-2024 12:00:00 AM

దేశంలోకి వెల్లువెత్తుతున్న చైనా గొడుగులు, ఆటబొమ్మలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: చైనా నుంచి గొడుగులు, ఆటబొమ్మలు, కొన్ని రకాల వస్త్రాలు, మ్యూజిక్ పరికరాల దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దీనితో దేశీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో భారత్ చైనాకు 8.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే చైనాకు ఎగుమతి చేయగా, ఆ దేశం నుంచి 50.4 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయని, ఫలితంగా చైనాతో భారత్ వాణిజ్యలోటు ఏ ఇతర దేశంతోనూ లేనంతగా 41.9 బిలియన్ డాలర్లకు చేరిందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల్లో పలువాటిని భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమ లు (ఎంఎస్‌ఎంఈలు) కూడా తయారు చేస్తాయని, చౌక చైనా ఉత్పత్తులతో పోటీపడలేక కొన్ని ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డా యని, మరికొన్ని నిలదొక్కుకోవడానికి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయన్నారు.

ఈ సవాళ్లు  దేశంలో ఉపాధి కల్పనను, ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. దేశంలోకి ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో 31 మిలియన్ డాలర్ల విలువైన గొడుగుల్ని చైనా సరఫరా చేసిందని, భారత్‌లో విక్రయమయ్యే గొడుగుల్లో చైనా వాటా 95.6 శాతమని జీటీఆర్‌ఐ తెలిపింది.  ఫర్నీచర్, బెడ్డింగ్, కిచెన్ సామగ్రి ఉత్పత్తి చేసే ఎంఎస్‌ఎంఈలు కూడా చైనా దిగుమతులతో పోటీపడలేక పోతున్నాయని జీటీ ఆర్‌ఐ తెలిపింది. పారిశ్రామిక దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం సత్వరమే తయారీ రంగంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉన్నదని శ్రీవాస్తవ సూచించారు. 

భారత్‌లోకి చైనా దిగుమతులు (2024 జనవరి-జూన్)

వస్తువు విలువ(డాలర్లలో) చైనా వాటా శాతం

గొడుగులు 31 మిలియన్లు 95.8

కృత్రిమ పుష్పాలు,

కేశాలంకరణ ఉత్పత్తులు 14 మిలియన్లు 91.9

గాజు ఉత్పత్తులు 522 మిలియన్లు 59.7

హ్యాండ్‌బ్యాగ్స్, లెదర్ ఉత్పత్తులు 121 మిలియన్లు 54.3

ఆటబొమ్మలు 120 మిలియన్లు 52.5

సెరామిక్ ఉత్పత్తులు 232 మిలియన్లు 51.4

మ్యూజిక్ పరికరాలు 15.7 మిలియన్లు 51.2

సిల్క్ దిగుమతులు 32.8 మిలియన్లు 41