19 మందిపై కేసు నమోదు
నిజామాబాద్, ఆగస్ట్ 29 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఓ పెళ్లి విందులో మటన్ ముక్క కోసం గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకొన్నారు. ఇరువర్గాలకు చెందిన 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవీపేట్ ఎస్సై వినయ్వివరాల ప్రకారం.. నందిపేట్ మండలం బాద్గుణకు చెందిన యువకుడికి, నవీపేట్కు చెందిన యువతితో వివాహం జరిగింది. నవిపేట్లోని ఓ ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేశారు. అమ్మయి వారు అబ్బాయి తరఫు బందువులకు మటన్ తక్కువగా వడ్డిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాటామాట పెరిగి ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.పెళ్లికి వచ్చిన బంధువులు డయల్ 100కు ఫోన్ చేయడంతో నవీపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పేందు కు యత్నించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల వారు పోలీసులపై సైతం తిరగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవ డంతో పోలీసులు రెండు వర్గాలకు చెందిన 19 మందిపై పోలీసు కేసు నమోదు చేశారు. దాడుల్లో దాదాపు 16 మంది గాయపడ్డారు. వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ లేకపోయినా.. పెళ్లికి వచ్చిన బంధువుల వల్ల గొడవ జరగడం విషాదం.