calender_icon.png 25 October, 2024 | 10:57 AM

సంగీత ప్రియులకు వీనుల విందు

19-07-2024 03:46:19 AM

ఈ వారం సినిమాలే కాదు.. సినీ గీతాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సంగీత ప్రియులకు వీనుల విందు చేసేందుకు తాజాగా గురువారం పలు చిత్రాలకు సంబంధించిన గీతాలు విడుదలయ్యాయి. ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ‘శివం భజే’ చిత్రం. దర్శకుడు అప్సర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్. మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మాణంలో డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నుంచి మొదటి పాటగా ‘రం రం ఈశ్వరం’ అనే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.

శివున్ని స్తుతిస్తూ సాగే ఈ గీతాన్ని పూర్ణాచారి రాయగా, సాయిచరణ్ పాడారు. వికాస్ బడిస ట్యూన్ భక్తిని ప్రేరేపిస్తోంది. దీంతోపాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న ‘శ్వాగ్’ చిత్రం నుంచి కూడా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ‘సింగర సింగ..’ అంటూ సాగుతున్న ఈ పాట ద్వారా సినిమాలోని హీరో శ్రీవిష్ణు పాత్ర ‘సింగరేణి అకా సింగ’ను పరిచయం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిలేష్ సుంకోజీ గీత సాహిత్యానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా, బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఆలపించారు. ఈ చిత్రంలో హీరోయిన్లు రీతూవర్మ, మీరా జాస్మిన్‌తోపాటు దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ముఖ్య తారాగణంగా ఉన్నారు.     

 ఇక దళపతి విజయ్ ‘గోట్’ నుంచి రెండో పాట పలుకరించింది. ‘నిన్ను కన్న కనులే..’ అనే ఈ పాటను యువన్ శంకర్ రాజా బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి యువన్ శంకర్ రాజాతోకలిసి ఎస్పీ చరణ్, చిత్ర గొంతు కలిపారు. అటు బాలీవుడ్ చిత్రం ‘బ్యాడ్‌న్యూజ్’లోని పాటల ఆల్బమ్‌ను హిందీ గీతాభిమానుల ముందుకు వచ్చేసింది. విక్రమ్ ‘తంగలాన్’ నుంచి ‘మినిక్కి’ అనే ఫస్ట్ సింగిల్ వచ్చింది.