calender_icon.png 23 October, 2024 | 12:50 PM

హరితనిధికి కచ్చిత ప్రణాళిక

07-08-2024 01:34:46 AM

  1. విరాళాలపై జవాబుదారీతనం అవసరం
  2. మంత్రి కొండా సురేఖ
  3. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి
  4. మంత్రి పొంగులేటి

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): హరితనిధి లక్ష్యం నెరవేరడానికి అవసరమరైతే సవరణలు చేపట్టి కచ్చితమైన కార్యాచరణ, ప్రణాళికతో ముందుకు సాగాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

హరితనిధి పురోగతిపై మంగళవారం సచివాలయంలో అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చదనం పెంపుదల కోసం చేపట్టిన హరితనిధిని పారదర్శకతంగా నిర్వహించాలని సూచించారు. ఆయా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధవిర్గాల నుంచి హరితనిధి నిమి విరాళాల వివరాలు, చేపట్టిన పనులపై ఆరా తీశారు.

హరిత నిధులతో మూడేళ్లకు మొ త్తం 3 దశల్లో 25 ప్రాజెక్టులను చేపట్టగా, 23 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.26.63 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ ఏడాది నాల్గో దశలో చేపట్టనున్న ఎఫ్‌బీవోల ట్రెయినింగ్, వనదర్శిని, వేర్వేరు జిల్లాల్లో 50 అర్బన్ పార్కుల ఏర్పాటు తదితర ప్రతిపాదలను మంత్రికి వివరించారు. హరితనిధితో చేపట్టిన ప్రాజెక్టుల వివరాల ను సమర్పించాలని ఆదేశించారు. 

వరంగల్ టు మేడారం గ్రీన్ కారిడార్ 

హరితనిధి నిధులతో వరంగల్, ములు గు డీఎఫ్‌వోల పరిధిలో వరంగల్ నుంచి మేడారం వరకు మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్‌ను రూ. 6.63 కోట్లతో, వరంగల్, హనుమకొండ డీఎఫ్‌వోల పరిధిలో రూ.5.6 కోట్లతో చేపట్టేందుకు స్టేట్ లెవల్ కమిటీ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ భూముల్లోని మొక్కల సంరక్షణకు 7.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

వరంగల్‌పై ప్రత్యేక దృష్టి

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించారు. 

స్మార్ట్ సిటీ, భద్రకాళి ఆలయం, మెగా టెక్స్‌టైల్స్ పార్క్, వరంగల్ ఎయిర్‌పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ది పరచాలన్న కృత నిశ్చయంతో వరంగల్‌పై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.

అభివృద్ధి పనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతి నిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు కోసం మానవీయ కోణంలో భూసేకరణను చేపట్టాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళోజి కళాక్షేత్రం పనులను ఈనెల 20 నాటికి పూర్తి చేయాలని, వచ్చే నెలలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. 

పదోన్నతులు కల్పించాలి 

రెవెన్యూ శాఖలో అర్హులైన ఉద్యోగులు అందరికీ పదోన్నతులు కల్పించాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు మంత్రి పొంగులేటికి మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు పదోన్నతులు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి అనుభవం ఉన్నవారికి అవకాశాలు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వాహనాల బిల్లులను మంజూరు చేయాలన్నారు. 

వీఆర్‌వోలను కొనసాగించాలి 

వీఆర్‌వోలను యాథావిధిగా తీసుకురావాలని వీఆర్‌వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్ మంత్రి పొంగులేటిని కోరారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో మినిస్టర్స్ నివాసంలో మంత్రిని జేఏసీ నాయకులు మంగళవారం కలిశారు.

సతీశ్ మాట్లాడుతూ.. మండల పరిధిలో తహసీల్దార్ ఒక కమాండర్ అయితే, గ్రామాధికారి సైనికుడు లాంటి వాడని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నందున ప్రతి గ్రామానికి అధికారిని నియమించడం వల్ల ప్రభుత్వ భూముల పరిరక్షణ జరుగుతుందన్నారు.