19-03-2025 01:24:49 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మాదిగ అమరుల ఆశయాలు, దశా బ్దాల ఆకాంక్ష నేటితో నెరవేరిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పే ర్కొన్నారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యాసంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబం ధించిన సమాచారాన్ని సేకరించి బిల్లును తయారుచేసినట్టు చెప్పారు.
తమ నాయకుడు రేవంత్రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 6 నెలల్లో వర్గీకరణ ప్రక్రియను చేపట్టి చట్టం చేస్తున్నారని, ఇది నిబద్ధతకు నిదర్శనమన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవానికి మించింది ఇంకేమీ లేదని, వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదని, ఇది కేవలం సామా జిక న్యాయం కోసమేనని తెలిపారు.
“రాష్ర్ట ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహిం చే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూ పొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదు” అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే తమ నాయకుడు రేవంత్రెడ్డి వర్గీకరణన చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారన్నారు.
కొత్తగా 26కులాలను చేర్చాం..
పాత వర్గీకరణకు, కొత్త వర్గీకరణకు తేడా ఎక్కువగా లేదని మంత్రి రాజనర్సింహ చె ప్పారు. 33 కులాలు పాత, కొత్త వర్గీకరణలో యథావిధిగా కొనసాగాయని, అయితే 26 కులాలను అదనంగా చేర్చి మొత్తం కులాలుగా ఎస్సీలను లెక్కగట్టినట్టు చెప్పారు. కొత్తగా చేర్చిన 26 కులాల జనాభా కేవలం 1.78 లక్షలు మాత్రమే అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అ మలు చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని సీఎం నియమించారని, ఆ తర్వాత రిటైర్డ్ జడ్జి, జస్టిస్ షమీమ్ అక్తర్ చైర్మన్గా ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి మొత్తం 8 వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్ స్వీకరిం చిందన్నారు. 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అంజేసినట్లు వివరించారు.
59 షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా విభజించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసిందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను మొదటి గ్రూపులో చేర్చగా.. వీరి జనాభా 1,71,625 (జనాభాలో 3.288) ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా,విద్యాపరంగా మధ్యస్థంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు 2లో ఉండగా..
ఈ కులాల జనాభా 32,74,377 కాగా.. వీరికి 9 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాత ఏ గ్రూపులోని 4 కులాలు, బీ గ్రూపులోని 10, సీ గ్రూపులో 20 కులాలు ఇప్పుడు కూడా అవే గ్రూపులో కొనసాగుతున్నట్లు మంత్రి చెప్పారు.
కొత్తగా చేరిన 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చినట్లు వెల్లడించారు. ఎస్సీ సమాజాన్ని‘అభివృద్ధి చెందిన’ ‘అభివృద్ధి చెందని’ గ్రూపులుగా విభజించడం వల్ల వనరుల పంపిణీలో అసమానతలకు దారి తీస్తుందని కమిషన్ సూచించినట్లు వివరించారు. కమిషన్ అధ్యయనం ప్రకారం.. 4 గ్రూపులుగా వర్గీకరించే స్థాయిలో షెడ్యూల్డ్ కులాల మధ్య తేడాలు లేనందున, 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇది చరిత్రాత్మకమైన రోజు..
ఎస్సీ వర్గీకరణ చేపట్టడం ఒక చరిత్రత్మాకమైన రోజుగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో వర్గీకరణ చేశాం.. ఇది అదృష్టంగా భావిస్తున్నా.. భవిష్యత్తులో వారి జనాభాకు తగ్గట్లుగా రిజ ర్వేషన్లు పెంచుతాం.
-ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్కమిటీ చైర్మన్,
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
కమిషన్ రిపోర్టు మాకు ఇవ్వలేదు..
ఎస్సీ వర్గీకరణతో మాలలు, మాదిగలకు మధ్య ఉన్న అపోహలు తొలగి పోవాలి. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని తాను కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. వర్గీకరణ సమయంలో మాలలపై తప్పుడు ప్రచారం చేశారు. మాదిగలకు 66,526లకు పైగా ఉద్యోగాలు వస్తే... మాలలకు 48,388ల జాబ్స్ మాత్రమే వచ్చాయి.
-కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కృష్ణమాదిగ పోరాటం గొప్పది
దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం ఎంతో గొప్పది. ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన ప్రధాని మోదీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి.
-బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్
ఉచిత విద్య, వైద్యం అందించాలి..
ఎస్సీ వర్గీకరణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనుకోవడం కరెక్టు కాదు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తే ఎంతో మార్పు వస్తుంది. దేశంలో పెనవేసుకుపోయిన కులపిచ్చిని రూపుమాపాలి. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం ఆపకపోతే ఎంత అభివృద్ధి చేసినా మార్పు రాదు.
- సీపీఐ కూనంనేని సాంబశివరావు
వర్గీకరణకు సంపూర్ణ మద్దతు
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. త్వరగా వర్గీక రణను పూర్తిచేసి ఇకపై విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి
మాలలే వెనకబడి ఉన్నారు
చాలామంది మాలలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలను అనుభవించినట్లుగా భావిస్తు న్నారు. కానీ వారే వెనకబడి ఉన్నా రని ఉషామెహ్రా కమిషన్ చెప్పింది. పంబాల, నేతకాని కులాలను విడదీయకుండా చూడాలి.
-కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్
ఎస్సీ వర్గీకరణ చరిత్ర
* 1931లో తొలిసారి కులగణన చేశా రు. అనంతరం 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారు.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ కృషితో దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
* రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదని, స్వాతంత్య్రం వచ్చిన 15 ఏండ్లకే అంటే 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని ఆ కమిటీ గుర్తించింది.
* ఎస్సీ వర్గాల ఆందోళనతో 1975లోనే పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది.
* 1990వ దశకం నాటికి ఉమ్మడి ఏపీ రాష్ర్టంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉధృతమైంది.
* ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్ను ఏర్పాటు చేసింది.
* ఆ కమిషన్ సిఫార్సులతో వెనుక బాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది.
* కమిషన్ సూచనల మేరకు 2000వ సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు.
* కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి రాష్ట్రంలో వర్గీకరణ ఆగిపోయింది.
* 2006లో దవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసుతో పంజాబ్లోనూ వర్గీకరణ నిలిచిపోయింది
* 2024 ఆగస్టు 1వ తేదీన వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే రోజున రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
* 2024 సెప్టెంబర్ 12న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
* 2024 అక్టోబర్ 11న హైకోర్టు సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు
* 82 రోజులు అధ్యయనం చేసిన కమిషన్ 2025 ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి వర్గీకరణ నివేదిక అందజేసింది.
* 2025 ఫిబ్రవరి 4న ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ అసెంబ్లీలో తీర్మానం
* వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 2025 మార్చి 6ను క్యాబినెట్ మీటింగ్ను నిర్వహించి ముసాయిదా బిల్లును ఆమోదించింది.
* 2025 మార్చి 18న బిల్లును అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారనుంది.