calender_icon.png 12 April, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింల పేరిట బీసీలను అణచివేసే కుట్ర

27-03-2025 12:06:41 AM

  • ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన 

జాజుల శ్రీనివాస్‌గౌడ్

బీజేపీ నేతల్లో మార్పు రావాలి: వీహెచ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): కులగణన తర్వాత బీసీల జాబితాలో ముస్లింలున్నారంటూ బీసీలను అణచివేసే కుట్ర బీజేపీ చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందాల గణేష్‌చారి అధ్యక్షతన బీసీ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలో పోరాడి సాధించుకున్నామన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఏప్రిల్ 2న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీల పోరుగర్జన చేపట్టబోతున్నట్లు తెలిపారు. వందలాది మందితో బీసీల్లోని 146 కులాల వృత్తుల ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

తెలంగాణలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లోనూ బీజేపీ బిల్లును పెట్టేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు మాట్లాడుతూ.. బీజేపీ ఎంతసేపు మతం పేరిట రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి కలిసి పోరాటం చేయకపోతే స్వాతంత్య్రం వచ్చేదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల్లో మార్పు రావాలని యాదగిరి నర్సింహస్వామిని వేడుకుంటున్నానని చెప్పారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బాలరాజుగౌడ్, వేముల వెంకటేశం, నగేష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రొ.బాగయ్య, శేఖర్, సత్తయ్యగౌడ్, బ్రహ్మచారి, కుమారస్వామి, ఐలి వెంకన్న, లక్ష్మణ్ పాల్గొన్నారు.