22-03-2025 12:00:00 AM
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21(విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 51 లో గల ఫికస్ గార్డెన్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిహెఎంసి కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జోనల్ కమిషనర్, యుబిడి అడిషనల్ కమీషనర్, హార్టికల్చర్, డిప్యూటీ కమీషనర్ లతో కలిసి గార్డెన్లో కలియ తిరిగి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, సుందరీకరణ పనులను పరిశీలించారు.
గార్డెనింగ్లో బాగా అనుభవం ఉన్న ఆర్కిటెక్తో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు పై భాగాన ఉన్న నేపథ్యంలో ఆ చెరువు వైపు నుంచి కూడా ఫార్మేషన్ రోడ్డు కాంపౌండ్ వాల్తో పాటు గేటు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్ నెంబర్ 47 వైపు కూడా గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గార్డెన్ లో లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి పార్కు అభివృద్ధి చేసిన తర్వాత నిర్వహణకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు గాని, వాకర్స్ అసోసియేషన్ కు బాధ్యతలు ఇవ్వాలని సూచించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కమిషనర్ యు బి డీ సుభద్ర దేవి, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, జూబ్లీ హిల్స్ ;డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులు సునంద, చంద్రశేఖర్, ఈ ఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.