calender_icon.png 25 October, 2024 | 11:59 AM

తండ్రికి తిండిపెట్టని తనయులపై కేసు

25-10-2024 01:22:34 AM

అలంపూర్, అక్టోబర్ 24 : అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రికి పట్టెడన్నం పెట్టకుండా కడుపు మాడుస్తున్న కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూగజీవాలు సైతం తినని పాచిపోయిన తిండి పెడుతూ, అడిగితే దండి స్తున్న కొడుకులపై చర్య తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురానికి చెందిన నాయక కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు బీచుపల్లి, వెంకటేశ్ ఉన్నారు. వీరికి కోరినట్టు వైభవంగా పెండ్లిలు జరిపించి, తాను సంపాదించిన ఆస్తిపాస్థులను పంచాడు. తాను మాత్రం గుర్రపు బండిని నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వచ్చిన కష్టార్జితాన్ని కొడుకులకే ఇస్తున్నా పట్టెడు అన్నం పెట్టడానికి వారికి మనస్సు రాలేదు.

విడివిడిగా ఉంటు న్న ఇద్దరి కొడుకులు.. పాచిపోయిన అన్నం పెడుతూ వేధించడం ప్రారంభించారు. పలుమార్లు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కినా వారు తీరు మార్చుకోలేదు. దీంతో గురువారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీచుపల్లి, వెంకటేశ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.