బాలిక కుటుంబానికి అండగా ప్రజా సంఘాలు
గద్వాల (వనపర్తి), అక్టోబర్ 22 (విజయక్రాంతి): బాలికతో వెట్టి చేయించుకున్న సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికతో చాలా కాలంగా వెట్టి చేయించుకుని, బంగారు గొలుసు పోయిందంటూ పోలీస్ స్టేషన్ వేదికగా అవమానించడంతో బాలిక ఆత్మహత్యాయ త్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ‘బాలికతో వెట్టి చేయించుకున్న సీడ్ వ్యాపారి’ శీర్షికన ఆదివారం విజయక్రాంతి కథనాన్ని ప్రచురించింది. దీంతో కొన్ని ప్రజా సంఘాలు స్పందించి ఆ కుటుంబానికి బాసటగా నిలిచా యి. ఆ తర్వాత సీడ్ వ్యాపారి కుటుంబం ఈ విషయాన్ని బయటకు చెబితే ఖబడ్దార్ అంటూ ఆ నిరుపేద కుటుంబాన్ని హెచ్చరించింది.
ఈ విషయాన్ని సైతం పసిగట్టి ‘నడిగడ్డలో రెడ్డి దర్బార్’ అనే మరో వార్త కథనాన్ని విజయక్రాంతి సోమవారం ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా అధికార వర్గాలు మేల్కొన్నాయి. బాధిత కుటుంబానికి ప్రజా సంఘాలు, ప్రజల నుంచి మద్దతు లభించడంతో ఎట్టకేలకు పోలీస్ ఉన్నతాధికారులు జువైనల్ జస్టిస్ 75, 79 బీఎన్ఎస్ యాక్ట్ 146 కింద సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్రెడ్డిపై కేసులు నమోదు చేసి, దర్యా ప్తునకు ఆదేశించారు.
అయితే బంగారం గొలుసు దొంగిలించిందని బండ్ల రాజశేఖర్రెడ్డి ఫోన్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుకే ఆగమేఘాలపై కదిలిన పోలీసు యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా బాలికను పోలీస్ స్టేషన్ వేదికగా విచారణ జరిపారు.
అవమానం భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పక్కన పెట్టడం పట్ల వారి శాఖలోని పోలీస్ అధికారులను కాపాడుకు నే కోసమే కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.