calender_icon.png 21 September, 2024 | 12:10 PM

అండర్‌పాస్ నీటిలో చిక్కుకున్న కారు

15-09-2024 12:00:00 AM

ఇద్దరు బ్యాంక్ ఉద్యోగుల మృతి

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 14: ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఫరీదాబాద్‌లోని అండర్‌పాస్ నీటితో నిండిపోగా శుక్రవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో అండర్‌పాస్ గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ కారు నీటిలో చిక్కుకుంది. ముందుకు, వెనక్కి కదలలేని స్థితిలో ఉండటంతో కారులోకి నీరు ప్రవేశించడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక చనిపోయారు. 

మృతులిద్దరూ గురుగ్రామ్‌లోని సెక్టార్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. విరాజ్ ద్వివేది క్యాషియర్‌గా, పుష్యశ్రీ శర్మ మేనేజర్‌గా ఉన్నారు. అండర్‌పాస్‌లో నీరు ఎక్కువగా ఉండటంతోనే కారు అందులో మునిగిపోయిందని మృతుడి సహచరుడు ఆదిత్య తెలిపారు. విరాజ్‌ను కారు నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ.. నీరు ఎక్కువగా వెళ్లడంతో డోర్లు లాక్ అయిపోయాయి. ఇలా కారులోకి నీరు నిండిపోవడంతో ఊపిరాడక ఇద్దరూ చనిపోయారని కన్నీటి పర్యంతమయ్యాడు.