23-03-2025 06:48:50 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 94వ వర్ధంతినీ ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కోతిమీర్ కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ... భారత స్వాతంత్య్ర పోరాటంలో అగ్రనాయకుడిగా నిల్చిన మహానాయకుడు. ఆయన జీవితం, పోరాటం, ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దృక్పథాన్ని, మానవ హక్కుల రక్షణను ప్రోత్సహించాయన్నారు.
భగత్ సింగ్ ధైర్యం, త్యాగం, స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం సమాజంలో మార్పు కోసం, అసమానతలకు వ్యతిరేకంగా నిలబడడానికి, యువతను ప్రేరేపించాయన్నారు. భగత్ సింగ్ యొక్క పోరాటం కేవలం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా, భారతదేశంలోని అన్ని వర్గాలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ, న్యాయం కోసం తన జీవితం అర్పించిన మహానాయకుడిగా ప్రపంచం చరిత్రలో నిలిచారు. ఆయన చూపించిన మార్గంలో యువత ఉత్సాహంగా, ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు సురేష్, నాగరాజు, గోరవ్, కళ్యాణ్, జాదవ్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.