సీఎం అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, కొత్త రేషన్కార్డులు, ఇతర అంశాలపై చర్చ
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చించనున్నారు. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ పైన విధివిధానాలను, షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు.
గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్లో అభయహస్తంలో వచ్చిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై ఇప్పటికే అధ్యయనం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రజలు, విపక్ష పార్టీల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో విధివిధానాలు నిర్ణయించనున్నారు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీనది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు విస్తరణతోపాటు మరికొన్ని అంశాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థికసాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నందున.. ఈ సమవేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.