calender_icon.png 7 October, 2024 | 3:59 PM

మహిళ దారుణ హత్య

07-10-2024 01:13:46 AM

ఆపై రేప్ కేసుగా చిత్రీకరించేందుకు యత్నం

నిందితురాలి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

కూకట్‌పల్లి, అక్టోబర్ 6: వ్యభిచార వృత్తిలో ఉన్న ఇద్దరు మహిళల మధ్య నెలకొన్న వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బాలా నగర్ డీసీపీ సురేశ్ కుమార్ వెల్లడించారు.

తాండూరుకు చెందిన కటారి మం జుల అనే మహిళ ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటూ వ్యభిచారం చేస్తూ జీవనం గడుపుతోంది. అలాగే నిజామాబాద్ జిల్లా అంభం గ్రామానికి చెందిన ధర్మారం ప్రియాంక(౨౦) రెండు నెలల క్రితం కేపీహెచ్‌బీ కాలనీకి వచ్చి వ్యభిచార వృత్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రియాంకతో మంజులకు పరిచయం ఏర్పడింది.

ప్రియాంక ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఆమె వద్ద ఉన్న వెండి వస్తువులను మంజులకు ఇచ్చి దాచి పెట్టమంది. వారం రోజుల తర్వాత తన వస్తువులు ఇవ్వాలని మంజులను కోరగా.. అప్పుడు, ఇప్పుడు ఇస్తా అంటూ కాలం వెళ్లదీసింది. అయితే, గత నెల 29న ప్రియాంక తన స్నేహితులైన కొందరు వ్యక్తులను తీసుకెళ్లి మంజుల ను బెదిరించి వస్తువులు తీసుకుంది.

మంజుల జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ప్రియాంకను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గత నెల 30న ప్రియాంకను తన ఇంటికి పిలిపించుకొని ఇద్దరు కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ప్రి యాంకను స్కూటీపై ఎక్కించుకొని లోధా అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న ఉదాసీన్ మఠం ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసింది. రేప్ కేసులాగా చిత్రీకరించాలనే కోణంలో అదే బ్లేడ్‌తో ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి శరీరంపై గాట్లు పెట్టి తిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

ఈ నెల 2న ప్రియాంక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళను హత్య చేసినట్లుగా పోలీసు లు నిర్ధారణకు వచ్చారు. గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా మంజులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించింది. దీంతో మంజులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.