01-03-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి): విద్యార్థుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కృత్తిమ మేధా కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం రాయడం సంబంధించి కృత్రిమ మేధా కార్యక్రమం పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్ లో కుత్రిమ మేధ సాఫ్ట్ వేర్ పొందుపరిచినట్లు తెలిపారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం కూడా నిర్మించవచ్చని చెప్పారు.
కృత్రిమ మేధా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేసే విధానం, దీనికి కావలసిన వసతులు సమీకరించుకుని జిల్లాలోని 6 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలైన తూప్రాన్, మనోహరాబాద్ మండలం కాళ్ల కల్, నర్సాపూర్ నెంబర్ -02 పాఠశాల, హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి పాఠశాల, నిజాంపేట్ పాఠశాల, మాసాయిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుని మానిటరింగ్ చేయడం జరిగిందని అన్నారు.
ఉద్యోగ విరమణ సర్వసాధారణం
మెదక్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్ గా విధులు నిర్వహించిన కిషోర్ బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని కిషోర్ బాబుని శాలువాతో సత్కరించారు. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని గత 29 సంవత్సరాలుగా క్రమశిక్షణ, అంకితభావంతో సేవ చేసిన కిషోర్ బాబు గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందడంతో పాటు , ఉత్తమ సేవలు అందించారని తెలిపారు. డీపీఆర్వో రామచంద్ర రాజు మాట్లాడుతూ కిషోర్ బాబు అంటేనే క్రమశిక్షణకు మారు పేరన్నారు. ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువమన్నారు. కార్యక్రమంలో కిషోర్ బాబు కుటుంబ సభ్యులు, మిత్రులు శర్మ, ఏపీఆర్ఓ బాబురావు, ప్రసాద్ తదితరులుపాల్గొన్నారు.