అచ్చంపేట: పశువుల కాపరిపై ఎలుగుబంటి దాడిచేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల శివారులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పర్కింల్తండాకు చెందిన పశువుల కాపరి అంజయ్య (55) శనివారం ఉదయం అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఉడిమిళ్ల పరిధిలో పశువులను మేపుతుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది.
దీంతో తీవ్ర రక్తస్రావంతో గ్రామపరిసరాల్లోకి రావడంతో స్థానికులు 108 తోపాటు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 108వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి అచ్చంపేట దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.